Friday 21 August 2020

ఫత్వా: టీవీ చూసిన పాటలు విన్నా శిక్ష తప్పదు

 ఫత్వా: టీవీ చూసిన పాటలు విన్నా శిక్ష తప్పదు

Aug 21, 2020, 15:05 IST

New Fatwa Issued in Murshidabad - Sakshi

కోల్‌కతా: ముర్షిదాబాద్ జిల్లాలోని మైనారిటీ ఆధిపత్య గ్రామానికి చెందిన అధిపతులు టెలివిజన్ చూడటం, క్యారమ్ ఆడటం, మద్యం లేదా లాటరీ టిక్కెట్లు కొనడం, అమ్మడం, సెల్‌ఫోన్లు, కంప్యూటర్ల ద్వారా సంగీతం వినడం వంటి ఇతర కార్యకలాపాలపై నిషేధం విధించారు. సామాజిక సంస్కరణల కమిటీ రూపొందించిన ఈ ఫత్వా ఆగస్టు 9న జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ నిబంధనలు అతిక్రమించిన వారికి చెవులు పట్టుకొని క్షమాపణలు చెప్పడం, గుండు చేయించడం, గుంజిళ్లు తీయించడం వంటి శిక్షలతో పాటు రూ .500 నుంచి రూ .7000 వరకు జరిమానాలు విధించనున్నట్లు ఆ ఫత్వాలో పేర్కొన్నారు.


ఈ కమిటీ సూచించిన శిక్షల జాబితా: 

టీవీ చూడటం, సంగీతం వినడానికి మొబైల్ ఫోన్లు లేదా కంప్యూటర్ ఉపయోగించడం: రూ. 1,000 జరిమానా

క్యారమ్‌ బోర్డు ఆడటం: రూ. 500 జరిమానా

లాటరీ కొనుగోలు: రూ. 2,000 జరిమానా

మద్యం అమ్మకం: రూ. 7,000తో పాటు గుండు చేసి గ్రామంలో ఊరేగిస్తారు. 

లాటరీ టికెట్లను అమ్మడం: రూ. 7,000 జరిమానా

మద్యం సేవించడం:  రూ. 2,000 జరిమానా, 10 గుంజిళ్లు

గంజాయి కొనుగోలు: రూ. 7,000 జరిమానా


అంతేకాకుండా నిబంధనలు ఉల్లంఘించిన వారి గురించి తెలియజేసేవారికి నేరం స్వభావాన్ని బట్టి 200 నుంచి 2,000 రూపాయల వరకు రివార్డును కూడా కమిటీ ప్రకటించింది. యువ తరం నైతిక, సాంస్కృతిక పద్దతులను తప్పి చెడు మార్గాలలో వెళ్లకుండా ఆపడానికి  వీటిపై నిషేధం విధించినట్లు కమిటీ పేర్కొంది.