వక్ఫ్ బిల్లుకు లోక్సభ ఓకే
ABN , Publish Date - Apr 02 , 2025
లోక్సభలో వక్ఫ్ సవరణ బిల్లు-2024 ఆమోదం పొందింది, విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. బిల్లులోని వివాదాస్పద సెక్షన్ 40ను రద్దు చేసి, వక్ఫ్ ఆస్తుల డిజిటలైజేషన్కు మార్గం సుగమం చేశారు
Waqf Bill Sparks Debate: వక్ఫ్ బిల్లుకు లోక్సభ ఓకే
అనుకూలంగా 226 ఓట్లు.. వ్యతిరేకంగా 163
ప్రతీ సవరణ మీద ఓటింగ్కు పట్టుబడిన విపక్షాలు
అర్ధరాత్రి దాటాక అన్ని సవరణలపై ఓటింగ్తో ఆమోదం
వక్ఫ్ బిల్లు పేరును ‘ఉమీద్’గా మార్చిన కేంద్రం
ప్రస్తుత చట్టంలోని సెక్షన్ 40 అత్యంత క్రూరమైనది
దాంతో ఏ భూమినైనా తమదేనని
వక్ఫ్ బోర్డు ప్రకటించవచ్చు
అలాంటి దారుణమైన సెక్షన్ను రద్దు చేశాం
లేదంటే పార్లమెంటు కూడా వక్ఫ్ ఆస్తే అంటారు!
జేపీసీ చేసిన అనేక సిఫారసులను పొందుపర్చాం
పేద ముస్లింల కోసం వక్ఫ్ ఆస్తులను వినియోగించాలి
బిల్లుపై చర్చలో మైనారిటీ వ్యవహారాల మంత్రి రిజిజు
బిల్లు రాజ్యాంగ విరుద్ధం: కాంగ్రెస్
ముస్లింలకు న్యాయం చేసేందుకే బిల్లు: అమిత్ షా
బిల్లు ప్రతులను చించివేసిన మజ్లిస్ ఎంపీ ఒవైసీ
న్యూఢిల్లీ, ఏప్రిల్ 2: వక్ఫ్ సవరణ బిల్లు-2024ను లోక్సభ ఆమోదించింది. ఈ బిల్లుకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో ఆందోళనకు దిగాయి. వారి నిరసనల నడుమ బుధవారం కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. వక్ఫ్ బిల్లు పేరును ‘యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్ ఎంపవర్మెంట్, ఎఫిషియన్సీ అండ్ డెవల్పమెంట్ (యూఎంఈఈడీ-ఉమీద్)’గా మార్చినట్లు వెల్లడించారు. సంయుక్త పార్లమెంటు కమిటీ (జేపీసీ) చేసిన అనేక సిఫారసులను కూడా బిల్లులో పొందుపర్చినట్లు తెలిపారు. జేపీసీ సిఫారసులను బిల్లులో చేర్చలేదన్న ప్రతిపక్షాల వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమన్నారు.
ఈ బిల్లుపై అన్ని వర్గాల అభిప్రాయాలు తీసుకున్నామని వెల్లడించారు. ఈ బిల్లును తీసుకురాకపోతే.. పార్లమెంట్ భూమిని కూడా వక్ఫ్ ఆస్తిగా చెబుతారని విమర్శలు గుప్పించారు. బిల్లుపై అర్ధరాత్రి వరకూ అధికార, ప్రతిపక్షాల మధ్య వాడీవేడి చర్చ జరిగింది. అనంతరం మూజువాణీ ఓటుతో ‘ఉమీద్’ను ఆమోదించేందుకు స్పీకర్ ప్రయత్నించారు. అందుకు విపక్షాలు అభ్యంతరం తెలపడంతో ఓటింగ్ జరిపారు. అనుకూలంగా 226, వ్యతిరేకంగా 163 ఓట్లు వచ్చాయి.
విపక్ష సభ్యులు తాము ప్రతిపాదించిన ప్రతి సవరణపైనా ఓటింగ్ జరగాలని పట్టుబట్టారు. అన్ని సవరణలపై ఓటింగ్ జరపడంతో ఆమోదం లభించేసరికి అర్ధరాత్రి దాటింది. బిల్లుపై చర్చ సందర్భంగా కిరణ్ రిజిజు మాట్లాడుతూ.. ఈ బిల్లు మతానికి సంబంధించినది కాదని, కేవలం ఆస్తుల విషయాలకు సంబంధించినదేనని స్పష్టం చేశారు. వక్ఫ్ బిల్లులోని అత్యంత క్రూరమైన సెక్షన్ 40 రద్దు కానుందన్నారు. ఈ సెక్షన్ కారణంగా ఏ భూమినైనా తమదేనని ప్రకటించుకునే హక్కు వక్ఫ్ బోర్డు, ట్రైబ్యునల్కు ఉందని.. దీన్ని కొందరు తమ స్వార్థ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేశారని ఆరోపించారు. ఇంతటి దారుణమైన సెక్షన్ను తాము తొలగించామని చెప్పారు. కొందరు ప్రతిపక్ష నేతలు చెబుతున్నట్లుగా ముస్లిం వర్గాలకు చెందిన ఏ భూమినీ తాము లాగేసుకోబోమని స్పష్టం చేశారు. ‘‘పేద ముస్లింల కోసం వక్ఫ్ ఆస్తులను ఉపయోగించాలి. వారిని అలా వదిలేయకూడదు. వారి ఉన్నతి కోసం మోదీ ప్రభుత్వం ఏవైనా చర్యలు తీసుకుంటే ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ముస్లిం ప్రతినిధులు ఆ బిల్లును ఆహ్వానించారు. వీలైనంత త్వరగా దీనికి ఆమోదం లభించాలని ఆ వర్గంలోని పేదలు కోరుకుంటున్నారు. అలాగే రిజిస్టర్ చేసిన ఆస్తి విషయంలో ఎవరూ జోక్యం చేసుకోరు. ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలతో ముస్లిం మహిళలు, పిల్లలకు హక్కులు దక్కుతాయి.
ప్రభుత్వ భూమి విషయంలో వివాదం తలెత్తితే కలెక్టర్ కంటే పైస్థాయి అధికారి తీర్పు ఇవ్వాలంటూ జేపీసీ చేసిన ప్రతిపాదనను మేం అంగీకరించాం’’ అని రిజిజు స్పష్టం చేశారు. ‘‘బిల్లు గురించి విపక్షాలు అసత్య ప్రచారం చేశాయి. 1954లో తొలిసారి వక్ఫ్ చట్టం అమల్లోకి వచ్చింది. అది అప్రజాస్వామికం అని ఆనాడు ఎవరూ చెప్పలేదు. తాజా బిల్లును పరిశీలించిన జేపీసీకి అభినందనలు. ఈ బిల్లు తీసుకురాకపోతే.. కొందరు పార్లమెంట్ భవనాన్ని కూడా వక్ఫ్ ఆస్తిగా పేర్కొంటారు’’ అని కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు. పార్లమెంట్ భవనం, దాని పరిసర ప్రాంతాలు వక్ఫ్ ఆస్తికి సంబంధించినవని గతంలో ఏఐయూడీఎఫ్ చీఫ్ బద్రుద్దీన్ అజ్మల్ అన్నారు. దానికి స్పందనగానే రిజిజు ఈ వ్యాఖ్యలు చేశారు. టెక్నాలజీని ఉపయోగించుకునేందుకు ఈ బిల్లు తోడ్పడుతుందని, వక్ఫ్ ఆస్తులన్నీ డిజిటల్ పోర్టల్లో ఉంటాయని, ఎవరూ ఆక్రమించేందుకు ఆస్కారం ఉండదని రిజిజు చెప్పారు. బిల్లును గురువారం రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు.
దౌర్జన్యపూరితం: కాంగ్రెస్
వక్ఫ్ సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ సభ్యుడు కేసీ వేణుగోపాల్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బిల్లును వ్యతిరేకించారు. కేంద్రం దౌర్జన్యపూరితంగా బిల్లును తెస్తోందని ఆరోపించారు. సభలో ప్రవేశపెట్టే బిల్లుకు సవరణలు ప్రతిపాదించే హక్కు సభ్యులకు ఉంటుందన్నారు. సవరణలకు కనీస సమయం ఇవ్వకుండా హడావుడిగా ప్రవేశపెట్టారని ఆక్షేపించారు. మోదీ సర్కారు ఆరెస్సెస్ అజెండాను అమలు చేస్తోందని విమర్శించారు. లోక్సభలో కాంగ్రె్సపక్ష ఉప నేత గౌరవ్ గొగోయ్ మాట్లాడుతూ.. వక్ఫ్ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని చెప్పారు. బిల్లు కేవలం పాలనాపరమైన మార్పులకు సంబంధించినది కాదని.. మైనారిటీ వర్గాలను అవమానించడం, భారత సమాజాన్ని విభజించడమేనని చెప్పారు.కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలను కేంద్ర హోం మంత్రి అమిత్ షా తిప్పికొట్టారు. ‘‘జేపీసీ వేయాలన్నదే మీరు. కమిటీ సూచించిన మార్పులుచేర్పులను అంగీకరించకపోతే జేపీసీని ఎందుకు ఏర్పాటు చేయమన్నారు’’ అని ప్రశ్నించారు.
వక్ఫ్ భూముల విషయంలో అవినీతిని అడ్డుకొని, పేద ముస్లింల భూమిని కాపాడడమే ఈ బిల్లు ఉద్దేశమని తెలిపారు. వక్ఫ్ అంటే అరబిక్లో అల్లా పేరుతో దానం అని అర్థమని, అది దాతృత్వ కార్యక్రమని చెప్పారు. మీది కాని భూమిని దానం చేయడాన్ని దాతృత్వమని అనరని గుర్తుచేశారు.
అమిత్ షా, అఖిలేశ్ వ్యంగ్యాస్త్రాలు
వక్ఫ్ సవరణ బిల్లుపై లోక్సభలో చర్చ సందర్భంగా సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ మాట్లాడారు. ‘‘ప్రపంచంలో అతిపెద్ద పార్టీ తన అధ్యక్షుడిని ఎన్నుకోలేకపోతోంది’’ అని బీజేపీని ఉద్దేశించి ఎద్దేవా చేశారు. ‘‘అఖిలేశ్ నవ్వుతూ ఓ విషయం చెప్పారు. నేను కూడా అలాగే సమాధానం ఇస్తా. కొన్ని పార్టీల నాయకత్వం ఐదుగురి చేతుల్లోనే ఉంటుంది. వారి నుంచే అధ్యక్షుడిని నియమించుకుంటారు. కానీ, మేం 12-13 కోట్ల మంది పార్టీ సభ్యుల నుంచి ఒకరిని ఎంపిక చేసుకోవాలి. అందుకు సమయం పడుతుంది. మీకు అలాంటిదేం అక్కర్లేదు. ఎందుకంటే మరో 25 ఏళ్లు మీరే పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతారు’’ అని షా బదులిచ్చారు.
ముస్లింలపై యుద్ధం ప్రారంభించిన మోదీ సర్కారు: ఒవైసీ
వక్ఫ్ బిల్లుపై చర్చ సందర్భంగా మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ బిల్లును ముస్లింలపై దాడిగా అభివర్ణించారు. మోదీ ప్రభుత్వం మసీదులు, దర్గాలు, మదర్సాలు, ముస్లింల స్వేచ్ఛపై యుద్ధాన్ని ప్రారంభించిందన్నారు. ప్రభుత్వం వాస్తవాలను దాచిపెడుతోందని విమర్శించారు. వక్ఫ్ బిల్లు రాజ్యాంగంలోని 14వ అధికరణాన్ని ఉల్లంఘిస్తోందన్నారు. ఆక్రమణదారులే యజమానులు అయిపోతారని, ముస్లిమేతరులు వక్ఫ్బోర్డు పాలనలో భాగస్వాములవుతారని ఆరోపించారు. ఆలయాలు, మసీదుల పేరిట బీజేపీ దేశంలో వివాదాలు సృష్టించాలని చూస్తోందన్నారు. ఈ సందర్భంగా ఆయన బిల్లు ప్రతులను చించివేశారు.
దేశంలో వక్ఫ్ బోర్డు నిర్వహణలోని
మొత్తం స్థిరాస్తులు: 8,72,324
వాటిలో ముఖ్యమైన ఆస్తుల వివరాలు
1) శ్మశానాలు 1,50,569
2) దుకాణాలు 1,13,193
3) వ్యవసాయ
భూములు 1,40,803
4) మసీదులు 1,19,280
5) ఇళ్లు 92,517
6) ప్లాట్లు 64,975
7) దర్గాలు 33,502
Waqf Amendment Bill: బిల్లులో ఒకే మార్పును కోరనున్న టీడీపీ.. అదేమిటంటే
ABN , Publish Date - Apr 02 , 2025 | 03:25 PM
బిల్లులో మహిళల భాగస్వామ్యాన్ని తప్పనిసరి చేయాలనే సవరణతో సహా అన్ని సవరణలకు టీడీపీ సానుకూలంగా ఉంది. వక్ఫ్ బిల్లుపై చర్చ సందర్భంగా పార్టీ ఎంపీలంతా తప్పనిసరిగా సభకు హాజరుకావాలని మూడులైన్ల విప్ను కూడా టీడీపీ జారీ చేసింది.
న్యూఢిల్లీ: వక్ఫ్ సవరణ బిల్లు 2024 (Waqf Amendment Bill)పై బుధవారంనాడు లోక్సభలో చర్చ మొదలుకావడంతో కొత్తం చట్టం పార్లమెంటులో ఆమోదం పొందుతుందా అనే దానిపైనే అందరి దృష్టి ఉంది. ఎన్డీయేలో కీలక భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనతాదళ్ (యునైటెడ్) పార్టీలు బిల్లుకు సానుకూలంగా ఉన్నాయి. అయితే ప్రతిపాదిత బిల్లులో చంద్రబాబు నాయుడు సారథ్యంలోని తెలుగుదేశం పార్టీ ఒక మార్పును సూచించే అవకాశం ఉన్నట్టు చెబుతున్నారు.
స్టేట్ వక్ఫ్ బోర్డులలో ముస్లిమేతరులను అనుమతించాలని టీడీపీ కోరనున్నట్టు ఆ పార్టీ వర్గాల సమాచారం. ముస్లిమేతరులకు బోర్డులో ప్రాతినిధ్యం కల్పించడం అనేది రాష్ట్రాల విచక్షణకు వదిలిపెట్టాలని పార్టీ ఏకగ్రీవ డిమాండ్గా ఉందని ఆ వర్గాలు తెలిపాయి. ఆ ఒక్క మార్పు మినహాయిస్తే బిల్లులో మహిళల భాగస్వా్మ్యాన్ని తప్పనిసరి చేయాలనే సవరణతో సహా అన్ని సవరణలకు టీడీపీ సానుకూలంగా ఉంది. వక్ఫ్ బిల్లుపై చర్చ సందర్భంగా పార్టీ ఎంపీలంతా తప్పనిసరిగా సభకు హాజరుకావాలని మూడులైన్ల విప్ను కూడా టీడీపీ మంగళవారంనాడు జారీ చేసింది.