Wednesday 1 January 2020

కాస్త ఆ పిల్లల మాటలు వినండి - Communal ism

కాస్త ఆ పిల్లల మాటలు వినండి
01-01-2020 00:17:36

ఆ పిల్లలకేమీ అర్థం కావడం లేదు. కేవలం ఒక మతం వారినే శత్రువులుగా ఎందుకు చూడాలో అస్సలు అర్థం కావడం లేదు. అయితే రాజ్యాంగమైనా తప్పవ్వాలి, లేదా వర్తమాన రాజకీయాల వ్యూహాలైనా తప్పవ్వాలి. రాజ్యాంగంలో ఆర్టికల్ 14 ప్రసాదించిన సర్వమానవ సమానత్వపు హక్కు అంటే వారికెంతో ప్రేమ. స్వేచ్ఛగా గౌరవంగా జీవించే హక్కును వరంగా ఇచ్చిన ఆర్టికల్ 21 అంటే వారికి మరీ ప్రేమ. మరిప్పుడు రాజ్యాంగం తప్పని చెప్పకుండానే, మా మాటే ఒప్పని మన ఏలిన వారు ఆదేశిస్తున్నారు. పాపం వారికేది దారి? అందుకే, ప్రశ్నించే దారి పట్టారు.

ప్రతి పిల్లాడితోనూ చిన్నప్పటి నుంచే ప్రతిజ్ఞ చేయిస్తాం భారతీయులందరూ నా సహోదరులని. పసిమనస్సులు పదేపదే అనీ అనీ అవే మాటలు గుండెల్లో పదిలంగా దాచుకుంటే అది వారి తప్పేం కాదు కదా. మనం కోరుకున్నది అదే కదా. పెద్దయ్యాక కూడా ఆ చిన్నప్పటి ప్రతిన మరవకపోతే మంచిదే కదా. యవ్వనం గుర్రమెక్కి వాళ్ళు దౌడు తీస్తున్నప్పుడు కూడా అదే ప్రతిన మళ్ళీమళ్ళీ గుర్తు చేసుకుంటే మరీ మంచిది కదా. అయితే వాళ్ళు ఆ ప్రతిజ్ఞ మాటిమాటికీ ఇంకా ఇంకా వల్లించాల్సిన అవసరం ఎందుకుంది? భారతీయులంతా ఒక సుహృద్భావ వాతావరణంలో సోదరత్వ స్వేచ్ఛావరణంలో మసలే పరిస్థితులు ఇంకా ఏర్పడ లేదనేగా అర్థం? అందుకే యువకులు యూనివర్సిటీల్లో ‘ఆలిండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్’ అని ఇప్పుడు నినదిస్తున్నారు.

అదే విద్యార్థి దశ నుండి అంచెలంచెలుగా నాయకులుగా ఎదిగి పెద్దపెద్ద పీఠాలు అధిష్టించిన పెద్దలు ఇప్పుడు యువకుల్ని చూసి అరే తప్పురా అవేం మాటలురా ఆపండి అంటున్నారు. అసలు విద్యార్థులకు రాజకీయాలా ఎందుకూ అని అబ్బురపడిపోతున్నారు. వారి వెనక ఎవరో దుష్టశక్తులున్నాయని వ్యాఖ్యానిస్తున్నారు. వాళ్ళు మనకంటే చిన్నపిల్లలే కానీ మరీ ఇంత చిన్న చూపు చూడాల్సినంత చిన్నవాళ్లేం కాదుగా. వినండి వాళ్ళేం చెప్తున్నారో.

బంగారు భవిష్యత్తు కోసం కలలై కొన్ని అలలై రెక్కలు విప్పుకుని ఎగరాల్సిన యువతీయువకులు... ఇలా ఎందుకు నిప్పురవ్వలై ఎగసిపడుతున్నారు? కొంచెం ఆలోచించండి. వాళ్ళ మాటలు వినండి. వాళ్ళకేం నచ్చడం లేదు– మన మాటలు, మన చేష్టలు, మన ఎత్తులు, మన పల్లాలు అన్నీ వాళ్ళకి అర్థమవుతున్నాయి. అవును సీఏఏ, ఎన్నార్సీల గురించే వాళ్ళిప్పుడు అడుగుతున్నారు.

భారతీయులందరూ మా సహోదరులు కాదా అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. హిందువులు మాత్రమే మా సహోదరులని చిన్నప్పుడే మాకెందుకు నేర్పలేదని గట్టిగా నిలదీస్తున్నారు. వాళ్ళకి చాలా సందేహాలు ఉన్నాయి. వాటిని తీర్చండి. జవాబులుగా మీరు లాఠీలను తూటాలను విద్యార్థుల మీద విసురుతున్నారు. దయచేసి పిల్లల హృదయ ఘోషనీ భాషనీ అర్థం చేసుకునే పెద్దరికాన్ని ప్రదర్శించండి.

వాళ్ళకేమీ అర్థం కావడం లేదు. కేవలం ఒక మతం వారినే శత్రువులుగా ఎందుకు చూడాలో అస్సలు అర్థం కావడం లేదు. అయితే రాజ్యాంగమైనా తప్పవ్వాలి, లేదా వర్తమాన రాజకీయాల వ్యూహాలైనా తప్పవ్వాలి. రాజ్యాంగంలో ఆర్టికల్ 14 ప్రసాదించిన సర్వమానవ సమానత్వపు హక్కు అంటే వారికెంతో ప్రేమ. స్వేచ్ఛగా గౌరవంగా జీవించే హక్కును వరంగా ఇచ్చిన ఆర్టికల్ 21 అంటే వారికి మరీ ప్రేమ. దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ అన్న మహాకవుల వాక్యాలంటే వారికి గుండెల నిండా అభిమానం. మరిప్పుడు రాజ్యాంగం తప్పని చెప్పకుండానే, మా మాటే ఒప్పని మన ఏలిన వారు ఆదేశిస్తున్నారు.

పాపం వారికేది దారి? వారి దారి వారు వెదుక్కున్నారు. ప్రశ్నించే దారి పట్టారు. ప్రశ్నించకుండా వాళ్ళెలా వుండగలరు? కలిసి మెలసి పెరిగి, కలిసి మెలసి చదువుకుని, కలిసే తమ జీవితాలనీ దేశాన్నీ భుజాల మీద మోసుకుంటూ ముందుకు నడవాల్సిన యువత చాలా గందరగోళపడుతుంది. ఏదో అపరాధ భావంతో కూడిన ఆగ్రహంతో వారు రగిలిపోతున్నారు. కూడూ గుడ్డా లేకున్నా పర్వాలేదు కానీ నీకు దేశమే లేదంటే ఎలారా భగవంతుడా అని అల్లాడిపోతున్న తమ దోస్తుల కళ్ళల్లోకి ఇప్పుడెలా చూడాలి? అని తల్లడిల్లుతున్నారు.

జవాబుల కోసం క్లాసుల్లోంచి రోడ్ల మీదకొచ్చారు. కూడికలూ తీసివేతలూ గుణకారాలూ భాగహారాలూ పూర్తయ్యాక నిదానంగా ఇప్పుడు ఏరివేత మొదలవుతుంని వారు పసిగట్టారు. ఏ బుల్ డోజర్లో పెట్టి ఇక మనుషుల్ని ఏరుతారు కాబోలని వారు గ్రహించారు. క్యూలో నిల్చోబెట్టి.. నుదుటి మీదే మత గ్రంథాల నీడలు చూసి.. ఇళ్ళల్లోంచి వీధుల్లోంచి దేశంలోంచి విసిరి పారేస్తారు కాబోలని నవతరం బిడ్డలు నిజాలు పోల్చుకున్నారు. మన పక్కనే ఉంటూ కూడా కళ్ళలోంచి మాటల్లోంచి భయం భయంగా చీకట్లు రాలుస్తూ తిరిగే సాటి సోదురుల్ని చూసి మాకే పాపం తెలీదని ఎలా తప్పించుకోవాలో చెప్పమంటున్నారు.

అభద్రతా భావాలు శూలాల్లా గుచ్చుకుంటున్న ఆత్మల నుంచి రక్తాలు కారుతున్న దేహాల మీద ఏ భరోసా నీడలు కప్పగలం? అందుకే విద్యార్థులు వీధుల్లోకి వచ్చారు. మీరు బాష్పవాయువులతో చుట్టుముట్టినా లాఠీలతో విరుచుకుపడినా తుపాకులు ఎక్కుపెట్టినా భారతీయులంతా మా సహోదరులే అనుకుంటున్నాం. అలాగే అనుకుంటాం. అలాగే ఉంటాం. మీరు కొత్త పాఠాలు రాసుకోండి. రానున్న తరాలకు కొత్త ప్రతిజ్ఞలు నేర్పుకోండి. మీరు మాకు నేర్పిన ప్రతిజ్ఞకు కట్టుబడి ఉన్నాం. ఏం చేస్తారో చేసుకోండని పిల్లలు కాదు పిడుగుల్లా చెలరేగుతున్నారు.

మరి వీళ్ళకి ఏ సమాధానాలు చెప్తారు? ఏం భయం లేదని, ఎవరూ అభద్రతకు గురవ్వాల్సిన అవసరం లేదని, కేవలం చొరబాటుదార్లే భయపడాలని నేతలు పైపై భరోసాలు ప్రకటిస్తున్నారు. కేవలం ఒక మతంవారిని లక్ష్యం చేసుకుని వారిని చాపచుట్టి సరిహద్దులకు ఆవల విసిరేసే చట్టాన్ని చేసేసి, ఉత్తుత్తి వచనాలతో ప్రవచనాలతో ఊరుకోబెట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారు. మనకు తెలియదేమో కానీ పిల్లలకు తెలుసు ఏ చట్టాలు ఎవరికి చుట్టాలో. వాళ్ళిప్పుడు ఇలా అడుగుతున్నారు: ఈ పేద దేశంలో 50, 60వేల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి ఎన్నార్సీని అమలు చేస్తారు సరే.

మరి తమ మతం ఏమిటో ప్రజలంతా ఏ విధంగా నిరూపించుకుంటారు? దానికి ఆధారాలేమిటి? జనాన్ని క్యూలో నిల్చోబెట్టి ఏ లెక్కలు ఎలా తేలుస్తారు? అంత తేలికా? కూటికీ గుడ్డకీ గూడుకీ నోచుకోని అభాగ్యులు కోట్లాదిమంది ఉన్నారు. వారికి తమదే మతమో, ప్రాంతమో నిరూపించుకునే పత్రాలు ఎలా వస్తాయి? ఏ అడ్డదారులు తొక్కాలి? దేశంలో దొంగచాటుగా వచ్చి చేరుతున్న అసాంఘిక శక్తులను కట్టడి చేయడానికే ఇదంతా అని అంటున్నారు కదా అలా దుర్బుద్ధితో వచ్చిన వారు ఈ చిన్న డ్రామా ఆడలేరా? ముస్లిం అన్న పేరు తప్ప ఏదో మతం పేరు చెప్పి తప్పించుకోలేరా? ఏరివేతకు గురయ్యేదెవరు? అమాయకులు, అసహాయులు, ఏ దారీ తెన్నూ లేని వారు, తమ మతం మార్చి చెప్పడానికి ప్రాణం పోయినా అంగీకరించలేని దిక్కులేని ముస్లింలేనా?

మన పిల్లలకు అన్నీ తెలుసు. ఈ కొత్తచట్టం దేశాన్ని నిట్టనిలువునా చీల్చేస్తుందని, దేశం తగలబడుతుందని... వాళ్ళు దాన్ని ఆపాలనే ఇలా తిరగబడుతున్నారు. హిందువుల్లో కూడా నిలవడానికి ఏ ఆధారమూ లేని వారు కోట్లలో ఉన్నారు. తెల్లారితే ఎక్కడుంటామో తెలియక స్వదేశంలోనే కాందిశీకులుగా బతుకుతున్న వారు కోట్లలో ఉన్నారు. ఏ ఆధార్ కార్డులు ఏ అర్ధరాత్రి వారందరికీ సరఫరా చేస్తారు? అసలు మతం ఆధారంగా ఈ ఏరివేత సాధ్యమేనా? పౌరసత్వం సరే లౌకికత్వం మాటేమిటి? మతం కత్తెరతో కత్తిరించేయడానికి దేశం ఒక గుడ్డముక్కేనా? మతం రాయితో బద్దలుకొట్టడానికి దేశం ఒక మంచుగడ్డేనా? ఇలా ఇప్పుడు మన విద్యార్థిలోకం ఆకాశం అదిరిపడేలా అరుస్తోంది. నేతలు వారికి సమాధానం చెప్పి తీరాలి. బలవంతంగా తమకు చట్టసభల్లో బలముందికదా అని ముందుకు వెళితే పరిణామాలు ఎలా వుంటాయో ఈ డిసెంబర్ చలిలో మంచు భగభగా మండి హెచ్చరిస్తోంది.

అసలే మహాత్ముని 150వ జయంతిని గర్వంగా జరుపుకుంటున్నాం. ఈ దేశాన్ని హిందువులతోనే నింపాలని హిందువులు కలగంటే అది కేవలం కలగానే మిగిలిపోతుందని గాంధీ తన హింద్ స్వరాజ్‌లో స్పష్టంగా పలికిన హితవు మన పాలకులకు గుర్తుందో లేదో కానీ మన విద్యార్థులకు మాత్రం బాగానే గుర్తున్నట్టుంది. వాళ్ళు గుర్తుచేస్తారు. చరిత్ర గర్తు చేస్తారు.

దేశాన్ని గుండెల్లో పెట్టుకుని కాపాడతారు. కనులు తెరిచే నిద్ర నటిస్తున్నవారిని కూడా లేపుతారు. పిల్లల్లో ఈ ఉత్సాహాన్ని ఉద్వేగాన్ని ఉద్రేకాన్ని చూస్తుంటే ‘ఓ సుబహా కభీతో ఆయేగీ..’ అనే నమ్మకం కుదురుతోంది. పెద్దలకే ఒక దారిని చూపే పిల్లలు అంటే ఏమిటో అర్థమవుతోంది. భవిష్యత్తు మీద మన ఆశ చావకుండా బతికిస్తుంది. ప్రశ్నించే వాళ్ళంతా దేశద్రోహులు కాదు. నిజం వైపు నిలబడేవారంతా దేశానికి శత్రువులు కాదు. విద్యార్థులు మనం నేర్పిన పాఠమే మనకు చెప్తున్నారు. మనం మర్చిపోయిన మన లక్ష్యాలను, ఆశయాలను మనకు గుర్తుచేస్తున్నారు. కాస్త వారి మాటలు కూడా విందాం. దేశం కోసం.
డా. ప్రసాదమూర్తి

No comments:

Post a Comment